
Canara Bank Theft: కర్నాటకలో భారీ బ్యాంకు దోపిడీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా 59 కేజీల బంగారం మాయం అయ్యింది. దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ దొంగతనం ఇంటి వారి పనా? బయటి దొంగల పనా? అని ఆరా తీస్తున్నారు.
మంగోలీ కెనరా బ్యాంకులో 59 కిలోల బంగారం మాయం
కర్నాటకలోని కెనరా బ్యాంకు దొంగతనం ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మంగోలీ బ్రాంచిలో డిపాజిటర్లు కుదువ పెట్టిన 59 కిలోల బంగారం మాయం అయ్యింది. చిన్న ముక్కలేకుండా అంతా దొంగలు దోచుకుపోయారు. దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకును పరిశీలించారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కెనరా బ్యాంకు దొంగతనానికి సంబంధించి విజయపుర ఎస్పీ లక్ష్మణ్ కీలక విషయాలు వెల్లడించారు. వరుస సెలవులు రావడంతో బ్యాంకు సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని త్వరగా గుర్తించలేదని వెల్లడించారు. “బ్యాంకు సిబ్బంది గత నెల 23న సాయంత్రం బ్యాంకుకు తాళాలు వేశారు. 24 నాడు నాలుగో శనివారం, 25 ఆదివారం కావడంతో ఎవరూ రాలేదు. 26న బ్యాంకు ప్యూన్ తలుపులు తెరిచేందుకు వచ్చాడు. అప్పటికే.. షట్టర్ తాళాలు పగిలి ఉండడం చూశాడు. వెంటనే, బ్యాంకు మేనేజర్ కు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకుని బ్యాంకు సిబ్బంది బ్యాంకును పరిశీలించారు. లాకర్లలోని 59 కిలోల బంగారం మాయం అయినట్లు గుర్తించారు. వెంటనే మాకు సమచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి పరిశీలించాం. గ్యాస్ కట్టర్లతో లాకర్లను కట్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించాం. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించాం. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం” అని ఎస్పీ లక్ష్మణ్ వెల్లడించారు.
Read Also: టీచర్ తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు ఆగ్రహం!