
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): విధి నిర్వహణకు అంకితంగా ఉండే పోలీస్ అధికారుల్లో మానవత్వం జిలుగులు కనిపించడం అరుదు. కానీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మాత్రం దానికి అద్భుత ఉదాహరణగా నిలిచారు. చిట్యాల నుండి మిర్యాలగూడకు వెళ్లే క్రమంలో, నార్కట్పల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబాన్ని చూసిన ఆయన, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అధికారిక వాహనంలోనే వారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బందికి గాయాల వివరాలను వెల్లడించి చికిత్స మొదలయ్యేలా చేశారు.
తన పనికి సంబంధించినది కాదని పక్కకు తప్పకుండా, బాధితుల పరిస్థితిని గమనించి సహాయం చేయడం ద్వారా డీఎస్పీ రాజశేఖర్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఉదంతం తెలుసుకున్న ప్రజలు “శభాష్ పోలీస్” అంటూ అభినందనలు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన ఈ సహాయ కార్యం వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో “భలా నల్లగొండ పోలీస్” అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా ఉన్నత అధికారులు కూడా ఆయన చర్యను అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ ముందుండే రాజశేఖర్ రాజు, ఈసారి మానవతావాదిగా మెరిశారు. ఇక గంజాయి, ఇల్లీగల్ అక్రమదందాలపై ఉక్కుపాదం మోపడంలో ఆయన శైలీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన ఔదార్యాన్ని, బాధ్యతాయుతమైన వైఖరిని నిరూపించుకున్నారు.