
Adah Sharma: వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ప్రత్యేకతను చూపించే నటి అదా శర్మ మళ్లీ ఒకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘ది కేరళ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించిన ఆమెకు ఆ చిత్రం ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో విడుదలైన ఈ చిత్రం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా అదా శర్మ ఈ సినిమా తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘‘రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్ విలువ పెరుగుతుంది. నా తొలి చిత్రం ‘1920’ నుంచే నేను ధైర్యవంతమైన పాత్రలను ఎంచుకున్నాను. ‘ది కేరళ స్టోరీ’ విడుదలయ్యే వరకు మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాను. ఆ సినిమా తర్వాత నా జీవితం, నా కెరీర్ పూర్తిగా మారిపోయాయి’’ అని అదా తెలిపారు.
‘‘ఆ సినిమా విడుదలైనప్పుడు దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగతా సగం మంది మాత్రం నన్ను రక్షించారు. వారు నాపై ప్రశంసలు కురిపించారు. బెదిరింపులు ఎదుర్కొన్నా, ఆ అనుభవాలు నన్ను మరింత ధైర్యవంతురాలిని చేశాయి’’ అని అన్నారు.
తదుపరి ప్రాజెక్ట్గా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చేసినట్లు తెలిపిన అదా.. అలాంటి విభిన్నమైన స్క్రిప్ట్స్ చేయడమే తనకు సంతృప్తి ఇస్తుందని పేర్కొన్నారు. ‘‘పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్ టచ్ రెండూ ఉంటేనే పాత్ర జీవం పొందుతుంది. నేను నటించే పాత్ర చూసి నా కుటుంబం ఆందోళన చెందాలి. అప్పుడు అది నన్ను తాకినట్టు అనిపిస్తుంది’’ అని అదా శర్మ చెప్పారు. కాగా, సినీ ప్రపంచంలో బోల్డ్ పాత్రలు, సవాలుతో కూడిన కథలు ఎంచుకుంటూ కెరీర్ను సరికొత్త దిశగా తీసుకెళ్తున్న అదా శర్మ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు.
ALSO READ: CRIME: దావత్లో విషాదం.. గొంతులో మటన్ బొక్క ఇరుక్కుని వ్యక్తి మృతి





