క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సొంతిళ్లు కట్టుకోవాలనేది ప్రతి సామాన్యుడి కల. దాని కోసం పగలనక.. రాత్రనకా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. తమ బడ్జెట్లో స్థలమో, ఇళ్లో తీసుకోవాలని భావిస్తారు. అయితే ఇదే అదనుగా రియల్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి భూముల కబ్జాలకు పాల్పడటంతో పాటు ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో బురిడీ.. ఫ్లాట్లు కట్టించి ఇస్తామని డబ్బు తీసుకుని ముఖం చాటేయడం.. ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం.. రాష్ట్రంలో ఇలాంటి రియల్ మోసాలు అనేకం వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే నమోదైన రియల్ ఎస్టేట్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఉంటుందని పోలీసు అధికారుల అంచనా వేస్తున్నారు.
Read Also : శంషాబాద్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
కష్టపడి సంపాదించిన సొమ్మును ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలుకు వెచ్చిస్తున్నవారు మోసగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం స్పందించింది. రియల్ ఎస్టేట్ మోసాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను అధికారులు బయటకు తీస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపన్ను శాఖలనూ రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో కనీసం వంద వరకూ వెంచర్లు ఉంటాయని అంచనా. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని.. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నారు. ప్రీ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి సామాన్యుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా.. భూయజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్టు ఆగిపోయి.. ప్రీ బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు పది శాతం భూవివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయి.
Also Read : ప్రభుత్వ భూమిలో కూల్చివేతలు సరే… మరి నిబంధనల మాటేమిటో?!
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రియల్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని వ్యాపారులు రకరకాల పద్ధతుల్లో ఇతర సంస్థల్లోకి మళ్లించుకుంటున్నారు. ఇదంతా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కిందికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీని రంగంలోకి దింపుతున్నారు. పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఈడీకి పంపారు. నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన ఈడీ.. ఇప్పటికే సాహితీ సంస్థ ఆస్తులను జప్తు చేసింది. త్వరలోనే మిగతా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోబోతోందని సమాచారం. మరోపక్క ఐటీ శాఖకు కూడా హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ శాఖ కూడా రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఈడీ, ఐటీ అధికారులతో హైదరాబాద్ పోలీసులు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పిడితే కేసులు నమోదు చేయటంతో పాటు జైలుకు పంపనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :