Telangana

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ నెలకొంది. 17 లోక్‌సభ స్థానాలకు 306 దరఖాస్తులు వచ్చాయంటే, డిమాండ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. ఇక తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్లు ఇప్పించుకోవడం కోసం ఏకంగా మంత్రులు కూడా రంగంలోకి దిగారు. టీ కాంగ్రెస్‌ నేతల కుటుంబాల నుంచి ఎంపీ సీట్ల కోసం అప్లికేషన్లు వెల్లువెత్తాయి. మల్లు భట్టి విక్రమార్క భార్య, కోమటిరెడ్డి కూతురు, పొంగులేటి తమ్ముడు.. తుమ్మల తనయుడు.. ఇలా అన్ని పవర్‌సెంటర్ల నుంచి అప్లికేషన్లు వరదలా వెల్లువెత్తాయి. హస్తం పార్టీలో ఎటుచూసినా ఉరిమే ఉత్సాహమే. అధిష్టానానికి మాత్రం అభ్యర్థుల ఎంపికలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక భువనగిరి ఎంపీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కూతురు శ్రీనిధిని బరిలో దింపే ఆలోచనలో ఉన్నారు. ఆమె ఢిల్లీకి వెళ్లి అక్కడే దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది.

Read Also : కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పెద్దపల్లి మాజీ MLA కన్నుమూత

ఇక అదే భువనగిరి లోక్‌సభ టిక్కెట్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కుమారుడు పవన్ రెడ్డి కూడా బరిలో దిగడానికి అప్లికేషన్‌ పెట్టారు. జనరల్, రిజర్వ్‌డ్ సీట్లు అనే తేడా లేకుండా కాంగ్రెస్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం సీటు అయితే వెరీ వెరీ హాట్ సీటుగా మారిందని చెప్పవచ్చు. ఈ సీటు కోసం ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇప్పించుకునేందుకు తీవ్ర పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి.. ఇద్దరూ ఖమ్మం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాకుండా మాజీ ఎంపీ వీహెచ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఇదే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఖమ్మం టిక్కెట్ ఎవరికి ఇస్తారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు భువనగిరి, నల్లగొండ, మహబూబాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ ఎంపీ స్థానాలు కూడా హాట్‌ సీట్లుగా మారాయి. వాటి కోసం కూడా ఆశావహులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. కరీంనగర్‌ ఎంపీ టిక్కెట్‌ కోసం రమ్యారావు, పెద్దపల్లి టిక్కెట్‌ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణ దరఖాస్తు చేశారు.

Also Read : బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు….

నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత పటేల్ రమేష్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు టికెట్‌ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పటేల్ రమేశ్‌ రెడ్డి. ఇక నల్లగొండ సీటు కోసం టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అప్లయ్ చేసుకున్నారు. రిజర్వ్‌డ్‌ సీట్లు అయిన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్ లకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబాబాద్ టిక్కెట్ కోసం విజయాబాయి, బలరాం నాయక్, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి టిక్కెట్ కోసం రామిళ్ళ రాధిక, యూత్ వింగ్ నాయకుడు పెరిక శ్యామ్ తో పాటు పలువురు నేతలు దరఖాస్తు చేశారు. సికింద్రాబాద్ టిక్కెట్ కోసం వేణుగోపాల స్వామి, అనిల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి, అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి అప్లయ్ చేసారు. మల్కాజిగిరి టిక్కెట్ కోసం సర్వే సత్య నారాయణ, బండ్ల గణేష్, కపిలవాయి దిలీప్ కుమార్, సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Also Read : రియల్ ఎస్టేట్ మోసాలపై పోలీసుల ఫోకస్.. రంగంలోకి ఈడీ, ఐటీ!!!

భువనగిరి టిక్కెట్ కోసం ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి, చామల కిరణ్, అప్లయ్ చేసుకున్నారు. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నర్సింహులు, సర్వే సత్య నారాయణ, పిడమర్తి రవి, వరంగల్ రవి, సిరిసిల్ల రాజయ్య తదితరులు అప్లయ్ చేశారు. చేవెళ్ల టికెట్ కోసం ఏ.దామోదర్, పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్ తదితరులు దరఖాస్తు చేశారు. నాగర్ కర్నూల్ కోసం మల్లు రవి, సంపత్ కుమార్, చారగొండ వెంకటేష్ అప్లయ్ చేసుకున్నారు.ఏఐసీసీ నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 17 స్థానాల్లో 15 గెలవాలని చూస్తున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాలని ప్రయత్నం చేస్తోంది. ఇక 300కు పైగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల వడపోత అధిష్టానానికి సవాలుగా మారనుంది. ఈ నెల 6 తర్వాత ఢిల్లీ నుంచి వచ్చే ఏఐసీసీ స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక ఇస్తారు. ఫిబ్రవరి 15 నుంచి 20 లోపల సీఈసీ సమావేశం జరిగి తెలంగాణ అభ్యర్థులపై అధిస్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి : 

  1. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు అరెస్ట్..!
  2. శంషాబాద్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
  3. ప్రభుత్వ భూమిలో కూల్చివేతలు సరే… మరి నిబంధనల మాటేమిటో?!
  4. పార్లమెంటు బరిలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరోకరు…???

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.