

తెలంగాణ పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని స్పష్టం చేసింది. డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. ఓ వాహనదారు మద్యం తాగినట్టు తేలితే, ఎట్టిపరిస్థితుల్లోనూ అతడిని వాహనం నడిపేందుకు అనుమతించరాదని స్పష్టం చేసింది. అతడి వెంట ఎవరూ లేని పరిస్థితుల్లో సన్నిహితులను పిలిపించి వాహనం అప్పగించాలని ఆదేశించింది.
ఒకవేళ మద్యం తాగిన వ్యక్తి తరఫున ఎవరూ రాకపోతే ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించాలని, తర్వాత వాహనాన్ని అప్పగించాలని పేర్కొంది. అతడి వెంట మద్యం తాగని వ్యక్తి ఉంటే అతడికి వాహనం ఇవ్వొచ్చని వెల్లడించింది. అంతేతప్ప మద్యం మత్తులో డ్రైవ్ చేసే వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పై హైకోర్టులో 40 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ జరిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని వాహన దారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలన్న హైకోర్టు.. కొన్ని తప్పనిసరి సందర్భాల్లో వాహనాన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చని తెలిపింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనాన్ని వాహనం ఆర్సీ చూపిస్తే అట్టి వాహనాన్ని రీలీజ్ చేయాలని ఆదేశించింది. అంతే కానీ డైరెక్టర్ గా మోటార్ వెకిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేసింది.