హైదరాబాద్: నా వరకూ వస్తే.. మీ అందరి అవినీతి చిట్టా విప్పుతానంటూ శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులోని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సవాలు చేయడంతో..
ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులు, బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారులూ వణికిపోయారు. ఆమెను కదపొద్దంటూ.. పాత, కొత్త అధికారులంతా ఒక్కటయ్యారు. అంతే.. సదరు ఉద్యోగినిని విధుల నుంచి తొలగిస్తూ నవంబరు 30, 2023న శేరిలింగంపల్లి రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జారీ చేసిన ఉత్తర్వు అటకెక్కింది.
ఒక్కటైన యంత్రాంగం..: శేరిలింగంపల్లి జోన్ పరిధిలో సంపన్నులు, ఖరీదైన భవనాలు ఉండటంతో.. అమ్యామ్యాలకు కొరత ఉండదని అధికారుల అంచనా. అందుకే జోనల్ కార్యాలయంలో ఏళ్లుగా కుర్చీలకు అతుక్కుపోయారు. జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నా వారిపై చర్యలు ఉండట్లేదనే ఆరోపణలున్నాయి. ఆయా అవినీతి వ్యవహారాలన్నింటిలోనూ.. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మధ్యవర్తిత్వం చేశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో.. ఓ సహాయ మున్సిపల్ అధికారి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆమెను ఇంటికి పంపాలని నిర్ణయించుకోవడం, కొన్ని రోజులకే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆర్వో ఉత్తర్వు జారీ చేయడం, ఆ తర్వాత ఆ ఉత్తర్వు అమలు నిలిపేశారని వివరించారు.
One Comment