
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మృతిపై సీఎంకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని కోరారు. ఎస్సీలు, గిరిజనులపై దాడులు ఇతర అంశాలపై చర్చించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
కేసీఆర్తో భేటీ అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ…‘‘ఎస్సీ మహిళ మరియమ్మ పోలీస్ లాకప్లో దారుణంగా చనిపోయిన వైనాన్ని సీఎంకు వివరించాం. రాష్ట్రంలో ఎస్సీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులను సీఎం దృష్టికి తెచ్చాం. మరియమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాం. ఎస్సీలు, గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపాం. మరియమ్మ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. లాకప్డెత్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కేటాయిస్తామని, ఆమె కుమార్తెలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సీఎం తెలిపారు. ఆమె బిడ్డలకు రూ.10లక్షల చొప్పున సాయం చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. మరియమ్మ కుమారురుడు ఉదయ్ కిరణ్కు రూ.15లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరగా.. అందుకు సీఎం ఒప్పుకున్నారన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.