HyderabadTelangana

వందేళ్లు వర్థిల్లే ఉప్పల్ స్కైవాక్… త్వరలో ప్రారంభానికి సిద్ధం

క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ ప్రతినిధి : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల వంతెన (స్కైవాక్) సిద్ధమైంది. ప్రారంభానికి అందంగా ముస్తాబైంది. ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా నిత్యం సుమారు 20 నుంచి 25 వేల మంది పాదచారులు అటూ ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అధికారుల అంచనా. దీంతో పాటు ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ వద్ద ఎప్పుడూ ప్రయాణీకుల రద్దీ ఉంటుంది. దీంతో ఈ కూడలి వద్ద వాహనాల రాకపోకలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ మంత్రి కేటీ రామారావు ఆదేశాలతో అధికారులు ఇక్కడ స్కైవాక్ నిర్మించారు. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఈ ప్రాజెక్టు చేపట్టింది. రూ.25 కోట్ల వ్యయంతో ఈ స్కైవాక్‌ను నిర్మించారు. ఈ స్కైవాక్ రాకతో ఉప్పల్ కూడలి మరింత సొగసును సంతరించుకుంది.

Read Also : మహారాష్ట్రపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్… త్వరలో 12 లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ!

విహంగ వీక్షణం ద్వారా కూడలి మరింత అందంగా కనిపిస్తోంది. ఉప్పల్ కూడలిలో మెట్రో రైలు ప్రయాణీకులు ఇకపై ‘మెట్రో కాన్‌కోర్ (ఫ్లోర్) నుంచి నేరుగా పాదచారుల వంతెన (స్కై వాక్) మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాల వైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. లిఫ్టులు, మెట్ల మార్గాల పరిసరాల్లో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం మొక్కలతో అందమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసింది. దీంతో స్కైవాక్ పరిసర ప్రాంతాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ఈ స్కైవాక్‌లో ప్రజల సౌకర్యార్థం 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 37 పిల్లర్లపైన ఈ స్కైవాక్‌ను నిర్మించారు. దీని పొడవు 660 మీటర్లు. మూడు, నాలుగు, అరు మీటర్ల వెడల్పుతో వివిధ నడక మార్గాలు ఉన్నాయి. భూమిపై నుంచి ఇది 6 మీటర్ల ఎత్తులో ఉంది. బ్యూటీఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ అతి త్వరలో ప్రారంభించనున్నారు.

Also Read : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోల దుశ్చర్య… 10 మంది జవాన్ల మృతి

వంద సంవత్సరాల పాటు సేవలు అందించేవిధంగా ఉప్పల్ స్కైవాక్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు 1000 టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్‌ను వినియోగించారు. హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు జరుగుతున్న అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రి కేటీఆర్ మూడేళ్ల కిందట స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌కు సూచించారు. ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి ఉప్పల్ సర్కిల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. వారు రూపొందించిన కొన్ని నమూనాల నుంచి ప్రస్తుత పాదచారుల వంతెన డిజైన్‌ను ఎంపిక చేసి దాదాపు రూ. 25 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండిఏకు అప్పగించారు. సుదీర్ఘకాలం మన్నిక కోసం ఈ స్కై వాక్ నిర్మాణంలో నాణ్యమైన స్టీల్‌ను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Read Also : తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది… ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం)తో పాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్‌ను తెప్పించి వినియోగించారు. ఈ స్కైవాక్ పనులు కాస్త ఆలస్యంగా పూర్తయ్యాయి. 2020 ఏడాది చివర్లో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు మొదలైనప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగింది. ప్రాజెక్టులో 90 శాతం మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండటం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు జరగలేదని అధికారులు తెలిపారు. ఉప్పల్ కూడలిలో ప్రధానంగా రోడ్డు దాటే సమయంలో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అక్కడ స్కైవాక్ నిర్మాణమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. వెంటనే పాదచారుల వంతెన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి : 

  1. ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్… రైతులు ఆదుకోవటంలో విఫలమైందని మండిపాటు
  2. కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అందరి ఫోకస్ రైతులపైనే!!
  3. అన్నదాతలు అధైర్య పడొద్దు… పంట నష్టపోయిన రైతులకు మంత్రి హరీశ్ భరోసా
  4. మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. కలకలం రేపుతోన్న యువతి వీడియో
  5. సుదర్శనయాగం, పూర్ణాహుతి, గ్యాదరింగ్.. కొత్త సచివాలయం ప్రారంభోత్సవ వేడుకలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.