
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్.. మజ్లిస్ పార్టీని కార్నర్ చేశారు. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీకు ఇంత సమయమా? అంటూ అక్బరుద్దీన్ ను ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాటలకు ఓవైసీ బాగా హర్ట్ అయ్యారు. ఏడుగురే అంటారా.. ఈసారి 50 స్థానాల్లో పోటీ చేస్తాం.. సభలో కనీసం 15మంది ఎమ్మెల్యేలు ఉండేలా చూస్తాం.. అంటూ అక్కడికక్కడే సవాల్ చేశారు. అక్కడితో ఆ విషయాన్ని వదిలేయలేదు ఓవైసీ. మర్నాడు కాంగ్రెస్ సభ్యులతో గంట పాటు మంతనాలు జరిపారు. 50 స్థానాల్లో AIMIM పోటీపై చర్చలు చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కు మజ్లిస్ హ్యాండ్ ఇస్తుందని.. కాంగ్రెస్ తో జట్టు కడుతుందనే ప్రచారం జరుగుతోంది.
మజ్లిస్ అనగానే రంగంలోకి దిగిపోయే బీజేపీ.. ఈసారి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓవైసీని మరింత రెచ్చగొట్టారు. 50 స్థానాలు కాదు.. ఏకంగా 119 స్థానాల్లో పోటీ చేయాలంటూ మజ్లిస్ పార్టీని సవాల్ చేశారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.BJP, AIMIMలు రహస్య స్నేహితులు అనే అనుమానం ఎప్పటినుంచో ఉంది. ఎక్కడ బీజేపీ వీక్ గా ఉంటుందో.. అక్కడ మజ్లిస్ రంగంలోకి దిగుతుంటుంది. ఆ వెంటనే మజ్లిస్ ను బూచీగా చూపిస్తూ.. కమలనాథులు సెంటిమెంట్ రాజేస్తుంటారు.వివిధ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీల మైండ్ గేమ్ ఇలానే ఉంటుందని అంటుంటారు. ఈసారి తెలంగాణలోనూ ఇదే గేమ్ ప్లాన్ వర్కవుట్ చేసేలా బీజేపీ పావులు కదుపుతుందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 119 స్థానాల్లో పోటీ చేయాలంటూ ఓవైసీకి బండి సంజయ్ ఛాలెంజ్ చేయడం వెనుక ఇదే రీజన్ కావొచ్చని అంటున్నారు.
ఎమ్ఐఎమ్ పార్టీకి పడేవన్నీ ముస్లిం ఓట్లే. ఆ వర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉండేది. తెలంగాణలో ఆ ఓటింగ్ బీఆర్ఎస్ వైపు మళ్లింది. లేటెస్ట్ గా అక్బరుద్దీన్ 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరపడంతో బీజేపీ అలర్ట్ అయింది. మజ్లిస్ పార్టీ ఎన్ని చోట్ల బరిలో దిగితే.. పరోక్షంగా కాషాయం పార్టీకి అంత ప్రయోజనం. అందుకే, ఓవైసీని కవ్విస్తూ.. 119 స్థానాల్లో పోటీ చేయ్.. డిపాజిట్ వస్తుందో చూద్దాం.. అంటూ రెచ్చగొడుతున్నారని అంటున్నారు.