
ఫిష్ మార్కెట్ల తరహాలోనే తెలంగాణలో త్వరలో మటన్ క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. గొర్రెల మేకల ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో మటన్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.గొర్రెల మేకల ఫెడరేషన్ వార్షిక పురోగతి సంపుటిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకము దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చి పెట్టిందని చెప్పారు బాలరాజు యాదవ్. ఈ పథకం వివిధ రాష్ట్రాల ప్రశంసలు పొందిందని తెలిపారు. కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రాన్ని సందర్శించి ఈ పథకం అమలు తీరును, దీని ద్వారా జరిగిన అభివృద్ధిని కళ్లారా చూసి ప్రశంసించడం జరిగిందని బాలరాజు యాదవ్ తెలిపారు.
క్షేత్రస్థాయిలో గొర్రెల పెంపకదారుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు బాలరాజు యాదవ్. గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారుల అవగాహన సదస్సులు నిర్వహించబోతున్నామని తెలిపారు. గొర్రెలకు వ్యాక్సినేషన్, నట్టల నివారణ మొదలైన కార్యక్రమాలు ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా జరుగుతున్నాయన్నారు బాలరాజు యాదవ్. ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక అంబులెన్స్లను పశువుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో గొర్రెల మేకల పెంపకదారులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ మరియు గొర్రెల మేకల ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ చందర్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు మరియు ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.