
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హోరాహోరీగా సాగిన మునుగోడు ఉపపోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది. బీజేపీపై 10 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించింది. ఓడినా మునుగోడులో బీజేపీ 38.4 శాతం ఓట్లతో 86 వేల 697 ఓట్లు సాధించింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. అయితే మునుగోడులో బీజేపీ ఓడినా అనుకున్న టార్గెట్ సాధించిందనే టాక్ వస్తోంది. పక్కా ప్లాన్ తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లిందని… అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందని అంటున్నారు. మునుగోడు ఫలితం తర్వాత పార్టీ పెద్దలు తెలంగాణ నేతలకు ఫోన్ చేసి అభినందించారని తెలుస్తోంది.
Read More : ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
హుజారాబాద్ ఓటమితో షాకైన సీఎం కేసీఆర్ మునుగోడుపై స్పెషల్ ఫోకస్ చేస్తారని బీజేపీ ముందే తెలుసు. ఎలాగైనా గెలవడానికి తన పార్టీ యంత్రాంగం మొత్తాన్ని మునుగోడులోనే మోహరిస్తారని… ఎంత ఖర్చైనా వెనుకాడరని… అధికారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటారని తెలుసు. అయినా కావాలనే కేసీఆర్ తో కయ్యానికి కమలం పార్టీ కాలు దువ్విందని అంటున్నారు. ముందే పక్కాగా స్కెచ్ వేసి.. లక్ష్యాలను నిర్ధేశించుకుని.. రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సై అన్నదని చెబుతున్నారు.మునుగోడులో ఓడినా తాము అనుకున్నది కమలనాధులు సాధించారని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే టిఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు ఉంటాయి.అందుకే ఆ రెండు పార్టీలు బలంగా ఉండేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇక్కడే కమలనాధులు తమ ప్లాన్ అమలు చేశారని అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావం ఉండదు, టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయిందంటున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ లో పెద్ద రచ్చే సాగింది. అభ్యర్థి విషయంలోనూ నానా రగడ జరిగింది. ఇవన్ని చూసిన జనాలు కాంగ్రెస్ ఇక మారదు.. రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకరించరు.. ఆ పార్టీతో లాభం లేదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లిందంటున్నారు.
కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయే పరిస్థితి చేయడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి కాంగ్రెస్ ను ఎలిమినేట్ చేయగలిగిందని అంటున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెబుతూ టిఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లందరికి బిజేపీని ఏకైక మార్గంగా ప్రజలకు చూపించడంలో కమలనాధులు విజయం సాధించారని అంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కాకుండా టిఆర్ఎస్ బిజెపి మధ్య ముఖాముఖి పోటీ ఉండేలా మునుగోడు ఎన్నిక ను ఒక అవకాశంగా బీజేపీ మార్చుకుందని అంటున్నారు. మునుగోడులోనే కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోవడంతో.. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా ఒక్క కమలానికే ఉందనే సంకేతాన్ని పంపించడంలో కమలనాధులు సక్సెస్ అయినట్టేనని చెబుతున్నారు.
ఒక ఉపఎన్నికను గెలవడానికి టిఆర్ఎస్ 14 మంది మంత్రులు, దాదాపు 100 మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బరిలోకి దింపడం ద్వారా ఆ పార్టీ బలహీనంగా ఉందనే సంకేతం జనాల్లోకి వెళ్లిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుగోడులో గెలవడానికి ఇంతగా శ్రమించారంటే.. ఆ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయం తెలిసిందంటున్నారు. మునుగోడు ఫలితంతో బీజేపీ తన లక్ష్యాలను పూర్తిగా సాధించినట్లేననే టాక్ వస్తోంది. మొత్తంగా మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయినా.. వ్యూహాత్మక విజయం సాధించిందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది.
ఇవి కూడా చదవండి …
One Comment