

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితకు స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనకు లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని కవిత చెబుతున్నా.. హైదరాబాద్ లో జరుగుతున్న సీబీఐ, ఈడీ దాడులు సంచలనంగా మారాయి. కవిత సన్నిహితుల ఇళ్లలో ఈడీ దాడులు జరగడంతో.. ఆమె టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయనే చర్చ సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత సన్నిహితులకు సంబంధం ఉందనే ఆధారాలు ఈడీకి లభించాయని అంటున్నారు. నెక్స్ట్ కవిత నివాసంలోనే సోదాలు జరుగుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి రామచంద్ర పిళ్లై… కవిత కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేయడం మరింత కాక రాజేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమంటున్నారు కమలం నేతలు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ రచ్చకు కారణమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ట్వీట్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. కవితను ఉద్దేశించి తీవ్రమైన కామెంట్లు చేశారు. ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఎక్కడ జరుగుతాయి.. కవిత బతుకమ్మ ఎక్కడ ఆడుతారు, ఈడి ఆఫీసా, సిబిఐ ఆఫీసా ఆ లేక తీహార్ జైల్లోనా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
కవితను టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. తెలంగాణలో గొప్ప పండుగను ఇలా అవమానించడం సరికాదని కొందరు తప్పుపడుతుండగా.. మరికొందరు జైలులేనా బతుకమ్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కోమటిరెడ్డి ట్వీట్ పై సీరియస్ గా స్పందిస్తున్నారు. తెలంగాణ పండుగను అవమానపరచిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మను అవమానించడమంటే తెలంగాణ ఆడపడుచులను అవమానించినట్టేనని ఫైరవుతున్నారు.