
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలకు హాజరు కాలేదంటూ బెల్లింపల్లి మున్సిపల్ కార్యాలయంలోని ముగ్గురి సిబ్బందికి నోటీసులు ఇచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంలో విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాచరికపు పోకడలుతారా స్థాయికి చేరాయంటూ ట్వీట్ చేశారు. ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకున్నారు.
ఈనెల 24 కేటీఆర్ బర్త్ డే. మున్సిపల్ మంత్రి జన్మిదిన వేడుకలను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించారు. స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి రావాలని అందరు ఉద్యోగులకు వాట్సాప్ మెసెజ్ పంపారు. అయినా ఈ కార్యక్రమానికి ముగ్గురు సిబ్బంది హాజరుకాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్.. ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బర్త్ డే వేడుకలకు హాజరుకాని సీనియర్ అసిస్టెంట్ టి.రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నం చందర్ , సిస్టమ్ మేనేజర్ మోహన్ కు మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో సంచలనంగా మారింది. నోటీసుల అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేటీఆర్ బర్త్ డే వేడుకలకు హాజరుకాలేదని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఘటనపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సిగ్గుపడాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ముగ్గురు ఉద్యోగులకు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన మెమోను సునీల్ దేవధర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.సునీల్ దేవధర్ ట్వీట్ కు భారీగా స్పందనలు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.