Uncategorized

విద్యార్థినులు బ్రాలు తీసేస్తేనే ఎంట్రీ! నీట్ పరీక్ష కేంద్రం దగ్గర అరాచకం

వైద్య విద్య చదివేందుకు దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎంట్రన్స్ పరీక్షపై మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి. పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థినులకు గతంలో చాలాసార్లు చేదు అనుభవం ఎదురైంది.మంగళసూత్రాలు.. ఇయర్ రింగ్స్ ఉంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వలేదు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. ఏకంగా రాష్ట్రపతి కోవింద్ రియాక్ట్ అయ్యారు. అయినా అలాంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు. తాజాగా వెలుగుచూసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన యువతులు కట్ డ్రాయర్ తీసేసి రావాలంటూ నీట్ ఎగ్జామ్ నిర్వాహకులు ఆదేశించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్ డ్రాయర్ తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు పేర్కొంది.

కేరళలో నీట్ పరీక్ష హాజరైన పలువురు విద్యార్థినులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా కట్ డ్రాయర్లను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు వందల మంది విద్యార్థినులు ఆరోపించారు.కొల్లం జిల్లా ఆయుర్లోని మాత్రోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంపై కోటరక్కరా డిప్యూటీ ఎస్పీకి బాధిత యువతి ఫిర్యాదు చేసింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆదివారం జరిగింది. పరీక్షా హాల్కు వెళ్లిన తమను లోదుస్తులు విప్పాలని బలవంతం చేశారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే తమను అనుమతించారని తెలిపింది. ఫలితంగా పరీక్ష సరిగా రాయలేకపోయానని ఫిర్యాదులో వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.అయితే దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. బయోమెట్రిక్ తనిఖీలు చేసే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది. ఆదివారం పరీక్ష పూర్తైన తర్వాత పెద్ద ఎత్తున లోదుస్తులను ఓ అట్ట పెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరైన విద్యార్థినుల బ్రాలు తొలగించాలని పరీక్ష కేంద్రం నిర్వాహకులు కోరడంతో విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిబంధనల మేరకే తాము ఇలా చేస్తున్నామని.. విద్యార్థినుల బ్రాలకు బెల్టులు ఉన్నాయని.. అందువల్లే వాటిని తొలగించాలని కోరామని నిర్వాహకులు సమర్థించుకున్నారు. విద్యార్థినుల ఇన్నర్వేర్లను తొలగించాలని పరీక్ష కేంద్రం నిర్వాహకులు కోరడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మొత్తం ఇలా 100 మంది విద్యార్థినులు ఇన్నర్ వేర్లు తొలగించాకే వారిని పరీక్ష రాయడానికి అనుమతించారు.

తిరువనంతపురం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని అయూర్లోని సెంటర్లో తన కుమార్తె ఈ కష్టాన్ని అనుభవించవలసి వచ్చిందని తల్లిదండ్రులు జూలై 18న అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాము తమ కుమార్తెను మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షా కేంద్రం వద్ద దింపామని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. తర్వాత పరీక్షా కేంద్రం నిర్వాహకులు తమను శాలువా ఇవ్వాలని కోరారని చెప్పారు. తమ కూతురు పరీక్ష ముగించుకుని బయటకు వచ్చాకే తమకు ఏం జరిగిందో అర్థమైందని వారు అన్నారు.తమ కూతురు ఇన్నర్వేర్లో మెటల్ వస్తువు ఉన్నట్టు స్క్రీనింగ్లో తేలిందని వారు చెప్పారని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా తమ కుమార్తెతోపాటు ఎంతోమంది విద్యార్థినుల ఇన్నర్ వేర్లు తీయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాలు తొలగించాకే పరీక్షకు అనుమతించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో పరీక్ష జరిగిన కళాశాల తమ పాత్ర లేదని చెప్పిందని యువతి తల్లి చెబుతున్నారు. పరీక్ష నిర్వహణకు అప్పగించిన ఏజెన్సీ వారే ఈ పనులు చేశారని ధ్వజమెత్తారు.ఇంత అవమానానికి గురైన విద్యార్థినులందరూ విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారని.. మానసికంగా చితికిపోయిన విద్యార్థినులు పరీక్ష కూడా సరిగా రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై కేరళ రాష్ట్ర ఎన్ఎస్యూఐ విభాగం అధ్యక్షుడు అభిజిత్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు మహారాష్ట్రలో ముస్లిం విద్యార్థినులు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిజాబ్ ధరించి పరీక్షకు హాజరయ్యేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ తీసేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వాశిం జిల్లాలోని మాతోశ్రీ శాంతాబాయి గోటె కళాశాలలో ఈ ఘటన జరిగింది.ఇరామ్ మహమ్మద్ జాకీర్ అరిబా సమన్ ఘజన్ఫర్ హుస్సేన్ అనే ఇద్దరు యువతులు పరీక్ష రాసేందుకు రాగా.. వారిని సిబ్బంది అడ్డుకున్నారు. తమతో అధికారులు అనుచితంగా ప్రవర్తించారని బాధిత యువతులు ఆరోపించారు. హిజాబ్ తీసేయకపోతే కత్తెరతో కత్తిరిస్తామని బెదిరించినట్లు చెప్పారు. తమతో వచ్చిన తల్లిదండ్రులతోనూ అధికారులు వాదనలకు దిగారని విద్యార్థినులు పేర్కొన్నారు.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.