
తెలంగాణలో మరో మణిహారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 28న ఈకార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతుంది.
ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 గురించి వివరించారు. కొత్తగా నిర్మించిన ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టానికి ఊతమిస్తుందని చెప్పారు. టీహబ్-2ను రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో అత్యంత విశాలమైన ప్రాంగణంలో నిర్మించింది. ఇందులో అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణ కేంద్రంగా రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లల్లో వివిధ కార్యక్రమాలతో 18 వందల స్టార్టప్లను టీహబ్ తీసుకొచ్చింది. సుమారు 600 కంపెనీలతో కలిసి సేవలందించింది. తాజాగా ప్రారంభించనున్న టీహబ్-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్లు తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.