
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉన్నా అప్పుడే ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. యాత్రలతో జనంలోకి వెళుతున్నారు ముఖ్య నేతలు. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణలో జోరుగా సర్వేలు సాగుతున్నాయి. అన్ని పార్టీలు, ప్రైవేటు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలవొచ్చు, ఎన్ని సీట్లు రావచ్చనే అంచనాకు వస్తున్నాయి.
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ప్రధాన పోరు కారు వర్సెస్ పువ్వు.. అన్నట్టే సీన్ క్రియేట్ చేశారు కేసీఆర్. హస్తాన్ని కాస్త వెనక్కి తోసేశారు. ఇక వరుస విజయాలను చూసి కమలదళం సైతం పొంగిపోతోంది. తామే తెలంగాణ బాహుబలులమంటూ పిడికిలి బిగిస్తోంది. అప్పుడే ఆ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ కూడా పెరిగింది. తాజాగా, అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. సీఎం కుర్చీ కోట బీజేపీలో మ్యూజికల్ ఛైర్ ఆట నడుస్తోందని అందరికీ తెలిసి పోయేలా చేసింది. సరిగ్గా ఇదే సమయంలో.. తెలంగాణలో జరిగిన వివిధ సర్వేల ఫలితాలు సైతం.. ప్రస్తుత రాజకీయ వేడికి తగ్గట్టుగానే ఉండటం ఆసక్తికరం.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయనేది ఆ సర్వేల సారాంశం. కారు పార్టీకి 8 సీట్లు రావొచ్చట. కాంగ్రెస్ 2తో సరిపెట్టుకుంటుందని చెబుతున్నాయి. లోక్సభ స్థానాల పరిధిలో జరిగిన ఈ సర్వేలు.. తాజా రాజకీయ పరిస్థితులకు దగ్గరగానే ఉన్నాయని అనిపిస్తోంది. కాకపోతే, ఎంపీ స్థానాల్లో మోదీని చూసి బీజేపీకి ఓట్లేసే ఛాన్సెస్ ఎక్కువ. కానీ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి సీన్ మారిపోతుందని అంటున్నారు. సీఎం కుర్చీ రేసులో.. కమలనాథుల కంటే గులాబీదళానికే విజయావకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. గట్టిగా చెప్పాలంటే, బీజేపీకి ఇప్పటికిప్పుడు మొత్తం 119 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు. ఆ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలపడనే లేదు. అర్భన్ పార్టీ ముద్ర ఇంకా తొలిగిపోలేదు. దుబ్బాక, హుజురాబాద్ గెలుపు క్రెడిట్.. బలమైన అభ్యర్థుల ఖాతాలోనే పడుతుంది కానీ ఆ విజయం పార్టీకి ఆపాదించలేం అంటున్నారు.
బీజేపీలో అప్పుడే తానంటే తానంటూ కమలం నేతలు ముఖ్యమంత్రి కుర్చీకి సూటి పెడుతున్నారని అంటున్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే అయినా.. ఇప్పుడున్న 3 సీట్లతో పోల్చితే.. అసెంబ్లీలో డబుల్ డిజిట్కు బీజేపీ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీల మధ్య చీల్చి.. మళ్లీ అధికారంలోకి రావాలనేది కేసీఆర్ వ్యూహం. అయితే, గులాబీ బాస్ ఊహించిన దానికన్నా బీజేపీ బలపడితే మాత్రం టీఆర్ఎస్ ఎత్తుగడ బెడిసికొట్టడం ఖాయం.
ఇవి కూడా చదవండి ..
- హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర.. 8 వేల మంది పోలీసులతో పహారా
- చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆంక్షలతో 40 కోట్ల మందికి నరకం
- ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను
- చత్తీస్ ఘడ్ లో మావోల ఘాతుకం… వంతెనను పేల్చివేసిన మావోయిస్టులు
- ఆర్టీసీ ఛార్జీల పెంపు పై టీడీపీ ఆందోళన
2 Comments