
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పరిధిలో 111 జీవో వివాదం ఎప్పటి నుంచో ఉంది. 111 జీవోను రద్దు చేయాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి.. కాని అమలు కావడం లేదు. తాజాగా జీవో 111 ను అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రకటించారు సీఎం కేసీఆర్. గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు గతంలో జారీ చేసిన జీవో 111 ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం దుమారం రేపుతోంది. సీఎం ప్రకటనపై జీవో పరిధిలోని గ్రామలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. జీవో 111ని రద్దు చేస్తే గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు. మిషన్ కాకతీయతతో గ్రామాల్లో చెరువుల సంరక్షణకు కంకణం కట్టుకున్న సర్కార్.. హైదరాబాద్ జలాశయాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
అసలేంటి జీవో 111లో ఏముంది…?
గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ+2కి మించి నిర్మాణాలు చేసేందుకు వీల్లేదు.
Read More : హిజాబ్ మతాచారం కాదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
అయితే ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేందుకు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల అవసరం ఉండేది. కానీ ఇప్పుడా అవసరం లేదు. కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో… జంట జలాశయాలపై ఆధారపడడం లేదని నగరవాసులు చెబుతున్నారు. అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా.. ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తే
తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు.ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో… ఈ జీవో పై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది.
గ్రామాల పరిధిలోని పాలకవర్గాలు జీవోను రద్దు చేయాలని కోరుతూ.. గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. అదే సమయంలో జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల అనంతరం.. గతేడాది సెప్టెంబరులో సీఎం కేసీఆర్ అధికారులతో జీవో 111పై ప్రత్యేకంగా సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ పొందించాలని ఆదేశించారు. గతంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నుంచి నివేదిక రాకపోవడంతో మరికొంత సమయం కావాలని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అంతలోనే జీవో 111పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం హాట్ టాపిక్గా మారింది.
ఇవి కూడా చదవండి ..
- తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
- పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
- రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
- బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!
- జగన్ కొత్త కేబినెట్ సిద్ధం.. ఇదిగో లిస్ట్!