
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బీజేపీపై పోరాటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. ప్రాంతీయ పార్టీలను సమీకరించే కార్యాచరణలో తొలి అడుగు వేశారు. ఆదివారం కేసీఆర్ ముంబైకి వెళ్తున్నారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆహ్వానం మేరకు ఆయనను కలుస్తారు. కేసీఆర్, ఉద్దవ్ భేటీతో దేశ వ్యాప్తంగా ప్రాంతీయ కూటమి చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని సరిగా నిలువరించ లేకపోతుందని ప్రాంతీయ కూటమి అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పైనా విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేసీఆర్ కొత్త కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ కూటమి విజయవంతమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. . కూటమి బలం, బలహీనతలపైనా చర్చిస్తున్నారు. కూటమీ ఏర్పాటు చేస్తున్న నాయకులు ఆయా ప్రాంతాల్లో బలమైన నాయకులే. స్టాలిన్, కేసీఆర్, మమతా బెనర్జీ, శరద్ పవార్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరు. కష్ట పడితే మంచి సీట్లు సాధించగలరు. అయితే కూటమి బలహీనత ఉమ్మడి నాయకుడు ఎవరన్నదే ప్రశ్న. అందరూ ప్రధాని అభ్యర్థులే కావడంతో ఉమ్మడి నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కష్టమని భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకమని చెబుతున్న ప్రాంతీయ పార్టీల నాయకులు.. ఏదో ఓ సందర్భంలో మోడీతో అనుకూలంగా వ్యవహరించిన వారే. ఈ నేపథ్యంలో వాళ్లంతా చివరి వరకు కలిసి ఉండగలరా అన్నది మరో ప్రశ్న.
మరోవైపు వామపక్ష పార్టీల దారి ఏంటన్నది తెలియడం లేదు. కేసీఆర్ తో లెఫ్ట్ నేతలు టచ్ లో ఉన్నా… ఎంతవరకు కొనసాగిస్తారన్నది అనుమానంగానే ఉందంటున్నారు. కేసీఆర్ కూటమిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అదే కామ్రెడ్లకు ఇబ్బందికరం. బెంగాల్ లో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మమత నాయకత్వంలోని కూటమిలో కొనసాగకూడదని వామపక్ష నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సీపీఎం అగ్రనేతలు సమావేశమయ్యారు. ఆ భేటీలో కొత్త కూటమిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్ కూటమి ప్రయత్నాలపై లెఫ్ట్ నేతలు చర్చించారట. అయితే మమత కీలకంగా ఉన్న కూటమిలో చేరవద్దని మెజార్టీ వామపక్ష నేతలు చెప్పారని సమాచారం. దీంతో కేసీఆర్ కూటమిలో కామ్రెడ్లు చేరకపోవచ్చనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. అంతేకాదు బీజేపీ మిత్రపక్షాలతో కాకుండా కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలతోనే కేసీఆర్ చర్చలు జరపడాన్ని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ఇది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉందని కొందరు లెఫ్ట్ నేతలు తెలిపారని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ కూటమికి కామ్రెడ్లు హ్యాండ్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- జగ్గారెడ్డి జగడం ఎందుకు.. రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?
- సీతక్క ఆవేదన.. జాతర వద్దే ఉన్న మంత్రులు గవర్నర్ రాగానే గాయబ్
- ఎమ్మెల్యే రాజాసింగ్ కు గండం.. కేసు నమోదుకు ఈసీ ఆదేశం
- యువతకు ఆదర్శం చత్రపతి శివాజీ మహారాజ్ .. ఎమ్మెల్యే ఆల
- మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులు