క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. అయితే వేదాశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఎత్తుగా ఉన్న బల్లపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ఎత్తు తక్కువగా ఉన్న చిన్నపీటపై కూర్చున్నారు. ఇప్పుడిదే వివాదస్పదంగా మారింది.
Read Also : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ దంపతులు.. పట్టువస్త్రాలు సమర్పణ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. అది అగ్రవర్ణాల అహంకారం అని మండిపడుతున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్లో పోస్టు చేశారు. ‘దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం..! ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం.’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఎంతటి హోదా ఉన్నా.. పదవి లభించినా.. బహుజనులు ఎప్పటికి బానిసలే.. అందుకు ఈ ఫోటోనే ఒక నిదర్శనం.’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి గౌరవానికి దిక్కు లేదు.. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ముగ్గురు రెడ్లేమో కుర్చీల మీద.. ఉప ముఖ్యమంత్రి నేల మీద.. వీళ్ల అహంకారమే.. ప్రభుత్వాన్ని కూల్చుతది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ రాసుకొచ్చారు.
Also Read : ఆపరేషన్ ఆకర్ష్తో బీజేపీ ఖుష్.. అభ్యర్థుల ప్రకటనపై నాయకుల జోష్..
‘దళిత రాజయ్యని పదవి నుంచి తీసేసిన దొరతో పొత్తు పెట్టుకునే మీరే మాట్లాడాలి.’ అంటూ మరో నెటిజన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం స్పందించారు. యావత్ దళిత జాతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చో బెట్టారని ఆయన మండిపడ్డారు. సాక్ష్యాత్తూ దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే.. దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి.. ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇలా భట్టి విక్రమార్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎవరికి వారు ఆ ఫోటోపై భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. మరి భట్టి ఈ వివాదంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం.. నేడు భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
- కాంగ్రెస్ వైపు మరో బీఆర్ఎస్ నేత చూపు.. శరవేగంగా మారుతున్న రాజకీయాలు!!
- చనిపోయిన స్నేహితురాలు పిలుస్తోందంటూ వివాహిత ఆత్మహత్య..
- మార్చి15 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ
- హీటెక్కుతున్న లోక్సభ ఎన్నికల పోరు.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ తప్పదా??