
- మంత్రి మల్లారెడ్డిపై జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఫిర్యాదు
- సీఎం వద్దకు చేరిన మేడ్చల్ వర్గపోరు
- మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ షాక్
- గ్రూపు రాజకీయాలకు తావులేదంటూ మల్లారెడ్డిపై ఫైర్..
- సీఎం చొరవతో వర్గపోరుకు తెర
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్లో చెలరేగిన వర్గపోరుకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మంత్రి మల్లారెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో కలకలం రేపిన మేడ్చల్ పంచాయతీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పరిష్కారమైంది. టీఆర్ఎస్ నూతన కమిటీల ఎంపికలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తనను పట్టించుకోవడం లేదని జడ్పీఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఇటీవల రాజీనామాకు సిద్ధపడిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రి మల్లారెడ్డితో పాటు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డిని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు.
మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, జిల్లా పరిషత్ ఛైర్మన్ అయిన తననే లెక్క చేయకుండా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ శరత్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తన సొంత మండలంలో ఎలాంటి సమచారం లేకుండా కమిటీ వేశారని, దీంతో మనస్థాపానికి గురై రాజీనామా చేయాలనుకున్నట్టు ఆయనకు వివరించినట్లు తెలిసింది. దీంతో మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
జిల్లాలో అందరినీ కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటు పడాలని, పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావులేదని కేసీఆర్ ఆయన్ని మందలించినట్లు సమాచారం. జడ్పీ ఛైర్మన్తో పాటు ముఖ్య నాయకులను కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటుపడాలని మల్లారెడ్డిని అదేశించినట్లు తెలిసింది. కొంతకాలంగా మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్లో కొనసాగుతున్న వర్గపోరు ఇప్పటితో కేసీఆర్ చొరవతో తెరపడినట్లేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.