
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ రాశారు. రేవంత్కు టీపీసీసీ ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి లక్ష్మారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ హైకమాండ్కు చాలా లేఖలు కూడా రాశారు. అయినా రేవంత్కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వడంతో ఆయన మనస్థాపం చెందినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లక్ష్మారెడ్డిని బుజ్జగించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను వెనక్కి తీసుకునేలా లక్ష్మారెడ్డిని ఒప్పిస్తారని పలువురు అంటున్నారు. ఇక రేవంత్ కూడా లక్ష్మారెడ్డితో మాట్లాడతారని టాక్ వినిపిస్తోంది. మరి లక్ష్మారెడ్డిని ఎలా సంతృప్తి పరుస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు లక్ష్మారెడ్డి బాటలో మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నట్లు సమాచారం.
సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం!
మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. మరో ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన టిపీసీసీ చీఫ్గా ఎన్నికైన రేవంత్రెడ్డి గత రాత్రి పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డిని కలిశారు. అనంతరం శాననమండలిలో మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి కలిశారు. నేడు ఆయన మరి కొంతమంది సీనియర్ నేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. అయితే మొదటి నుంచి రేవంత్ విషయంలో విముఖతగా వున్నా సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావును ఆయన భేటీ అవుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బయటి నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ ఎలా ఇస్తారంటూ వీహెచ్ వంటి నేతలు బహిరంగంగానే విమర్శించడం తెలిసిందే.