
న్యూఢిల్లీ:మాజీ కేంద్రమంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ అజిత్ సింగ్ కరోనాతో గురువారం మరణించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కరోనాతో గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన కరోనా సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. మాజీ ప్రధాని చౌదురి చరణ్ సింగ్ కొడుకే అజిత్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్పట్ నుండి ఆయన ఏడుదఫాలు ఎంపీగా విజయం సాధించారు. 1996లో ఆయన రాష్ట్రీయలోక్దళ్ ను ఏర్పాటు చేశారు. ఉత్తర్ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతంలో ఈ పార్టీకి మంచి పట్టుంది. యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అజిత్ సింగ్ కేంద్ర సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి గా పనిచేశారు. 2001నుండి 2003 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలోకేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడ పనిచేశారు. ఆ సమయంలో వాజ్పేయ్ ప్రధానిగా ఉన్నారు. 1986లో ఆయన తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1989 నుండి ఆయన భాగ్ప్ నుండి తొలిసారిగా ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టాడు. 1991,1996,1997,1999,2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన ఎంపీగా విజయం సాధించారు. కాన్పూర్ ఐఐటీ నుండి ఆయన బీటెక్ (కంప్యూటర్ సైన్స్ ) ను పూర్తి చేశారు. ఇల్లినాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన ఎంఎస్ పూర్తి చేశారు. 1960లో ఐబీఎంలో పనిచేసిన ఇండియన్స్ లో ఒకరు.