
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: కోర్టు ధిక్కరణ కేసులో ఖమ్మం జిల్లా కలెక్టర్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి విధించిన జరిమానాను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో రూ.500 జరిమానా విధిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కలెక్టర్ ఆర్వీ. కర్ణన్ దాఖలు చేసిన అప్పీల్పై మండిపడింది. సింగిల్ జడ్జి ముందుస్తుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఉత్తర్వులు వెలువరించారంటూ పేర్కొనడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి తప్పుబట్టింది. జడ్జి వేరు.. తీర్పు వేరు.. రెండింటి మధ్య తేడాను ప్రభుత్వ న్యాయవాది గుర్తించాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ అప్పీలులో పేర్కొన్న అంశాలు కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలంటూ ఖమ్మం కలెక్టర్, ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలను తొలగించడంతో పాటు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో హైకోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కలెక్టర్ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని.. తెలియక పొరపాటు చేశారని, ఇది మొదటి తప్పని సర్ధిచెప్పే ప్రయత్నం చేసారు.. 2012 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారికి ఈ మాత్రం తెలియదంటే ఎలా? అని హైకోర్టు మండిపడింది.
అసలు ఏం జరిగింది?
ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఖమ్మం ప్రజలు కలెక్టర్కు వినతీ పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్కు రూ.500 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తన జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ ఖమ్మం కలెక్టర్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కలెక్టర్పై హైకోర్టు మండిపడింది. చివరి అవకాశంగా కోర్టుకు వస్తారని.. కానీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయరని నిలదీసింది. కలెక్టర్ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని.. తెలియక పొరపాటు చేశారని, ఇది మొదటి తప్పని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారర. ఐతే 2012 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారికి ఈ మాత్రం తెలియదంటే ఎలా? అని హైకోర్టు మండిపడింది.